![Ksheerabdi Dwadasi](https://www.poojalu.com/wp-content/uploads/2022/11/Ksheerabdi-Dwadashi.jpg)
కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ధి ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజునే దామోదరద్వాదశి, యొగీస్వరద్వాదశి అని కూడా అంటారు. ఉత్థాన ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ధి ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం.
దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరమథనం ప్రారంభించినది ఈరోజే. అందుకే ఈ రోజుకి మధన ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు కనుక చిలుక ద్వాదశి అని అంటారు.
ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీమహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు. క్షీరసాగర మధనములో జన్మించిన తేజోభరితమైన అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు . అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచరమును బట్టి శ్రీ మహాలక్ష్మికి, శ్రీమన్నారాయుణునికీ వివాహము చేసెదరు.
బృందా దేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీమహావిష్ణువు సాలగ్రామ రూపమును ధరించినది ఈ మహోత్కృష్టమైన రోజే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి.
క్షీరాబ్ధి ద్వాదశి నాడు శివకేశవ అభేదంగా ఉదయం శ్రీమహావిష్ణువును కార్తీక దామోదరునిగా భావించి పూజలను చేసి, సాయంత్రం తులసి, ఉసిరి మొక్కలకు సభక్తి పూర్వకంగా పూజలనుచేసి సాలగ్రామ, దీపదనములను చేయుటవల్ల గత జన్మలలో చేసిన పాపరాశి ధ్వంసం అవుతుందని ప్రతీతి.
1 Comment. Leave new
So very nice chala bavundi